క్వీన్స్టౌన్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఏకైక టీ20లో భారత మహిళల జట్టు పరాజయం పాలైంది. బుధవారం జరిగిన పోరులో హర్మన్ప్రీత్ బృందం 18 పరుగుల తేడాతో ఓడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. సూజీ బేట్స్ (36), సోఫియా డివైన్ (31) రాణించారు. భారత బౌలర్లలో పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులకు పరిమితమైంది. ఆంధ్ర అమ్మాయి సబ్బినేని మేఘన (37; 6 ఫోర్లు) టాప్ స్కోరర్గా నిలువగా.. షఫాలీ వర్మ (13), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (12), రిచా ఘోష్ (12), పూజ (10), స్నేహ్ రాణా (6) ఎక్కువసేపు నిలువలేకపోయారు. క్వారంటైన్ నిబంధనల కారణంగా స్టార్ ఓపెనర్ స్మృతి మందన మ్యాచ్కు దూరం కావడం భారత విజయావకాశాలను దెబ్బతీసింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో రాణించిన తహూహు (27; 1/27)కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే తొలి మ్యాచ్ జరుగనుంది.