న్యూజిలాండ్తో తొలి వన్డే
క్వీన్స్టౌన్: వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. శనివారం జరిగిన మొదటి వన్డేలో మిథాలీరాజ్ బృందం 62 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 275 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సూజీ బేట్స్ (106) శతక్కొట్టగా.. అమీ సాటర్వైట్ (63) హాఫ్సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో జులన్ గోస్వామి, పూజా వస్ర్తాకర్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిథాలీరాజ్ (59) అర్ధశతకం నమోదు చేయగా.. యస్తిక భాటియా (41) ఫర్వాలేదనిపించింది. ఆడిన తొలి వన్డేలోనే ఓపెనర్ అవతారమెత్తిన తెలుగమ్మాయి సబ్బినేని మేఘన (4) విఫలమైంది. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 వికెట్లు పడగొట్టింది. బేట్స్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించగా.. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం ఇక్కడే జరుగనుంది.