న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: దేశీయ ముడి చమురు ఉత్పత్తి గత ఆర్థిక సంవత్సరం (2021-22) 2.67 శాతం క్షీణించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ ఉత్పత్తి లక్ష్యాలను అందుకోకపోవడం ప్రభావితం చేసింది. అయితే ఇదే సమయంలో కేజీ బేసిన్లో రిలయన్స్-బీపీ సహజవాయువు ఉత్పత్తి పెరిగింది. కాగా, 2021-22లో క్రూడాయిల్ ఉత్పత్తి దేశంలో 29.69 మిలియన్ టన్నులుగా ఉన్నది. 2020-21లో 30.5 మిలియన్ టన్నులుగా నమోదైంది. నిజానికి గత ఆర్థిక సంవత్సరం 33.61 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దీంతో 11.67 శాతం తగ్గినైట్టెంది. ఈ మేరకు బుధవారం చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఐదేండ్ల నుంచి దేశీయ ముడి చమురు ఉత్పత్తి పడిపోతుండటం గమనార్హం. 2017-18లో 35.7 మిలియన్ టన్నులుగా ఉంటే.. 2018-19లో 34.2 మిలియన్ టన్నులకు, 2019-20లో 32.2 మిలియన్ టన్నులకు వచ్చింది. 2021-22లో ఓఎన్జీసీ క్రూడ్ ఉత్పత్తి 19.45 మిలియన్ టన్నులుగానే ఉన్నది.
ఇది నిర్దేశిత లక్ష్యం కంటే 13.82 శాతం, 2020-21 కంటే 3.62 శాతం తక్కువ. ఇప్పుడున్న చమురు క్షేత్రాల్లో సుదీర్ఘకాలంగా ఉత్పత్తి జరుగుతుండటమే ఈ క్షీణతకు కారణమని అంటున్నారు. ఇక గత ఆర్థిక సంవత్సరం సహజ వాయువు ఉత్పత్తి 18.66 శాతం పెరిగి 34 బిలియన్ క్యూబిక్ మీటర్లను తాకింది.