హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రహదారి భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని రోడ్డు భద్రతపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చైర్మన్ జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే అభినందించారు. మరికొన్ని పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కమిటీ శనివారం శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో రాష్ట్ర రవాణా, పోలీసుశాఖల అధికారులతో సమావేశమైంది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఆరు లక్షల సీసీ కెమెరాలకు తోడుగా మరో ఐదు లక్షల సీసీటీవీ కెమెరాలు బిగించాలని సమావేశంలో నిర్ణయించారు. పలు రోడ్లు, మెట్రోస్టేషన్లు, ఎంఎంటీఎస్ స్టేషన్లు, టీఎస్ఆర్టీసీ బస్ టర్మినళ్లు, బస్ షెల్టర్ల వద్ద వీటిని ఏర్పాటుచేయనున్నారు. ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్) వెంట లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లతో కూడిన ట్రామా సెంటర్లను హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే మాట్లాడుతూ.. రాష్ట్రంలో 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా 6,690 మంది మృతిచెందారని, హెల్మెట్, సీట్బెల్ట్ పెట్టుకొంటే మృతుల సంఖ్యను చాలా వరకు తగ్గించే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద కారణాలపై అధ్యయనానికి ఎన్ఐటీ వరంగల్కు సహకరిస్తామని చెప్పారు. రూ.25 కోట్లతో రోడ్ సేఫ్టీ ఫండ్ ఏర్పాటుచేయాలని గత సమావేశంలోనే నిర్ణయించినట్టు గుర్తుచేశారు. రాష్ట్రంలో రోడ్డు భద్రతకు తీసుకొంటున్న చర్యలను రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, శాంతిభద్రతల అడిషనల్ డీజీ జితేందర్, రోడ్డు, రైల్వే భద్రత అడిషనల్ డీజీ సందీప్శాండిల్య, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు. ఈ ఏడాది రాష్ట్రంలో రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమించిన 10,728 మంది డ్రైవింగ్ లైసెన్స్లు రద్దు చేసినట్టు తెలిపారు. ఇందులో డ్రంకెన్ డ్రైవ్ కేసులు 6,298 ఉన్నట్టు వివరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఐదేండ్లలో ఫుట్పాత్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, జంక్షన్ల ఏర్పాటు కోసంం రూ.1,839 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్ల ఇంజినీర్ ఇన్ చీఫ్ పీ రవీందర్రావు, ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ గణపతిరెడ్డి, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి, రవాణాశాఖ అధికారులు, ఎన్హెచ్ఏఐ, ఆర్అండ్బీ, పోలీసు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.