హైదరాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఎనిమిది ఏండ్లుగా నలుగుతున్న పౌర సరఫరాల సంస్థకు చెందిన రుణ వివాదం కొలిక్కి వచ్చింది. సమస్య పరిష్కారానికి ఇరు రాష్ర్టాలు అంగీకరించడంతో వివాదం సమసినట్టేనని అధికారులు భావిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీపై నెలకొన్న వివాదాల పరిష్కారానికి కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సబ్ కమిటిని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఆశిష్కుమార్ తెలంగాణ, ఏపీల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు, కేంద్ర ఆహార, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. రెండు రాష్ర్టాల మధ్య అపరిష్కృతంగా ఉన్న వివాదాలపై సమావేశం చర్చించింది. సబ్సిడీ విడుదలను, క్యాష్ క్రెడిట్తో లంకె పెట్టకుండా వివాదాన్ని పరిష్కరించుకోవాలని వివాద పరిష్కార కమిటీ ఇరు రాష్ర్టాలకు సూచించింది. కేంద్రం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం ఇరు రాష్ర్టాలు వేర్వేరుగా కేంద్రాన్ని కోరాలని తెలిపింది. ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణకు సబ్సిడీ రూపంలో రూ. 354 కోట్లు, ఆంధ్రప్రదేశ్కు రూ. 650 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నది. వీటిని వెంటనే విడుదల చేయాలని కేంద్రానికి తమ కమిటీ సిఫారసు చేస్తుందని హామీ ఇచ్చింది. దీంతో ఇక ఈ వివాదానికి తెరపడినట్టేనని ఆశిష్కుమార్ స్పష్టం చేశారు.