షాద్నగర్ రూరల్, జనవరి 19: తాను దిగాల్సిన స్టేషన్ దాటిపోతుందనుకొని నిద్రమత్తులో రైలులోంచి దూకి ఓ జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ స్టేషన్లో మంగళవారం చోటుచేసుకొన్నది. కడప జిల్లా చిట్వెల్కు చెందిన బట్టినాపాతి జ్యోతిరెడ్డి (28) కడప నుంచి కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. రైలు షాద్నగర్ రైల్వేస్టేషన్కు రాగానే నిద్రలో నుంచి మేల్కొన్నారు. కాచిగూడ స్టేషన్ దాటి పోయిందని భావించిన ఆమె తన లగేజ్తో ఒక్కసారిగా ప్ల్లాట్ఫామ్ మీదకు దూకింది. దీంతో ప్లాట్ఫామ్కు రైలుకు మధ్యలో పడి తీవ్రంగా గాయపడింది. హైదరాబాద్లోని ప్రైవేటు దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది. మహబూబ్నగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.