న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ తెలిపారు. స్టేడియంలో మే 2వ తేదీ వరకు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఆటగాళ్లు కరోనా బారినపడడంతో టోర్నీని బీసీసీఐ వాయిదా వేసిన విషయం తెలిసిందే. టీకాలు వేసేందుకు మరో కేంద్రం అవసరమని భావిస్తే.. స్టేడియాన్ని టీకా కేంద్రంగా మార్చితే ఇక్కడ ప్రతి రోజు కనీసం పదివేల మందికి వ్యాక్సిన్లు వేయొచ్చని చెప్పినట్లు రోహన్ పేర్కొన్నారు.
సాధారణ స్థితికి వచ్చే వరకు స్టేడియాన్ని వాడుకోవచ్చన్నారు. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విషయాన్ని పరిశీలిస్తామని సమాధానం ఇచ్చినట్లు రోహన్ తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో 864 టీకా కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం 18 ఏళ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం టీకాలు వేస్తోంది. ఇదిలా ఉండగా.. సీఎం అరవింద్ శనివారం మాట్లాడుతూ నగరంలో కరోనా ప్రభావం తగ్గిందని, పాజిటివిటీ రేటు 11శాతానికి పడిపోయిందని తెలిపారు. నిన్న ఢిల్లీలో 6,500 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.