న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశంలోని పిల్లలకు మరో కరోనా టీకా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ ఫార్మా సంస్థ ‘బయలాజికల్ ఈ’ అభివృద్ధి చేసిన కార్బివాక్స్ టీకాను 12-18 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పరిమితులతో కూడిన అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. 12-18 ఏండ్ల పిల్లల కోసం భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాకు డీసీజీఐ ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. గత నెల 3 నుంచి 15-18 ఏండ్ల పిల్లలకు ఈ టీకాను అందిస్తున్నారు.
అయితే 15 ఏండ్లలోపు పిల్లలకు వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాగా, కార్బివాక్స్ రెండో డోసుల టీకా. 28 రోజుల వ్యవధితో రెండో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏండ్లు నిండిన వారికోసం కార్బివాక్స్ టీకాకు గతేడాది డిసెంబర్ 28నే డీసీజీఐ అనుమతి ఇచ్చింది. మరోవైపు, నోవోవాక్స్ సంస్థతో కలిసి తాము అభివృద్ధి చేసిన కొవొవాక్స్ టీకాను 12-17 ఏండ్ల పిల్లలకు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) సోమవారం డీసీజీఐని కోరింది.