కొండాపూర్/హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 22: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో టమాటపై పరిశోధనకు కేంద్ర ప్రభుత్వం రూ.6.18 కోట్లు విడుదల చేసింది. ది రెపోజిటరీ ఆఫ్ టొమాటో జీనోమిక్స్ రిసోర్సెస్(ఆర్టీజీఆర్)లో టమాట జన్యు, జీవక్రియ, ప్రొటీన్కు సంబంధించిన అంశాలపై పరిశోధనలు చేపట్టారు. వీటి పరిశోధన మెరుగ్గా సాగేందుకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జీవసాంకేతిక విజ్ఞానశాఖ ఈ నిధులను విడుదల చేశాయి. నాలుగేండ్లలో సాగే పరిశోధనల కోసం ఈ నిధులను కేంద్రం మంజూరు చేసిందని వర్సిటీ యాజమాన్యం తెలిపింది. టమాటలో పోషకాలు పెంచి, ఎక్కువ కాలం నిల్వ ఉంచే పరిశోధనలు చేస్తున్నట్టు వివరించింది. ఈ ప్రాజెక్ట్కు ‘రిసెర్చ్ అండ్ సర్వీస్ ఫెసిలిటీస్ ఫర్ ప్లాంట్ మెటాబోలోమిక్స్ అండ్ ప్రోటీమిక్స్’గా నామకరణం చేసినట్టు వెల్లడించింది. ఆర్టీజీఆర్లో ప్రొఫెసర్ ఆర్పీ శర్మ, డాక్టర్ వై శ్రీలక్ష్మీ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నది.