అహ్మదాబాద్ : గుజరాత్ కాంగ్రెస్ మాజీ నేత హార్ధిక్ పటేల్ పార్టీని వీడిన మరుసటి రోజే కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అతిపెద్ద కులతత్వ పార్టీ అని నిప్పులు చెరిగారు. అహ్మదాబాద్లో గురువారం హార్ధిక్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక చీఫ్గా తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని ఆరోపించారు. కార్యనిర్వాహక అధ్యక్షుడి బాధ్యతలు కేవలం పేపర్పైనే ఉన్నాయని, రెండేండ్ల పాటు తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదని దుయ్యబట్టారు.
తాను బీజేపీలో చేరబోవడం లేదని పేర్కొన్నారు. కాషాయ పార్టీలో చేరికపై బీజేపీతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. బీజేపీలో చేరడంపై ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరవద్దని పటేల్ నేతలు హెచ్చరించారని, వారికి తాను క్షమాపణలు చెబుతున్నానని చెప్పారు. వారు తనను కాంగ్రెస్లో చేరవద్దని ఎందుకు చెప్పారో ఇప్పుడు తనకు అర్ధమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని పటిదార్ నేత ఆరోపించారు.
రాహుల్ గాంధీ హాజరైన దహోద్ ఆదివాసీ సత్యాగ్రహ ర్యాలీకి 25,000 మంది హాజరైతే 70,000 మంది వచ్చారని ఖర్చుల కోసం బిల్లులు సమర్పించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా అవినీతి జరుగుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ ఇక్కడకు వస్తే ఆయనకు ఎలాంటి చికెన్ శాండ్విచ్ ఇవ్వాలి, డైట్ కోక్ ఎలా ఉండాలనే దానిపై నేతలు చర్చిస్తుంటారని, కుల రాజకీయాలు మినహా వారి నుంచి మరొకటి ఆశించబోమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం ఒక కుటుంబం చుట్టూనే తిరుగుతుందని ఆరోపించారు.