హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆలస్యంతో తెలంగాణ 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. దాని విలువ అక్షరాలా రూ.ముప్పై వేల కోట్లు. సరైన, నిర్దేశిత సమయంలో ఎన్టీపీసీ ప్లాంటు, యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం (వైటీపీసీ) నిర్మాణం చేసి ఉంటే వేల కోట్ల డబ్బు మిగిలేది. వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉపయోగపడేది. కానీ.. కేంద్రం నిర్వాకం వల్ల రాష్ట్రం తన అవసరాలకు బయటి మార్కెట్లో ఎక్కువ ధరకు కరెంటును కొనుక్కోవాల్సి వచ్చింది. ఎన్టీపీసీ ప్లాంటు ఆలస్యం వెనుక కేంద్ర నిర్లక్ష్యం, ఎన్టీపీసీ అలసత్వం ఉండగా, వైటీపీఎస్ ఆలస్యం వెనుక రూ.30 వేల కోట్ల కాంట్రాక్టు చేజిక్కించుకొన్న బీహెచ్ఈఎల్ అలసత్వం ఉన్నదని తేటతెల్లమైంది. ఈ రెండు పవర్ స్టేషన్లు సరైన సమయంలో పూర్తి కాకపోవటంతో ఆ మేర విద్యుత్తును రాష్ట్రం కోల్పోయినట్టే. ముందు చూపు నిర్ణయాలు
తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ర్టాన్ని ఆర్థికంగా, పారిశ్రామికంగా, వ్యవసాయికంగా బలోపేతం చేసేందుకు 24 గంటల విద్యుత్తు ముఖ్యమని గ్రహించిన సీఎం కేసీఆర్.. విద్యుత్తుపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే విభజన చట్టం ప్రకారం 4 వేల మెగావాట్ల(5 యూనిట్లు- ఒక్కో యూనిట్లో 800 మెగావాట్లు) ప్లాంట్లను రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు మొదలుపెట్టేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెచ్చింది. ఇందులో రెండు యూనిట్ల నిర్మాణం మొదలుపెట్టారు.
అదే సమయంలో సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలని తలచిన సీఎం కేసీఆర్.. తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో మరో 4 వేల మెగావాట్ల (5 యూనిట్లు- ఒక్కో యూనిట్లో 800 మెగావాట్లు) సామర్థ్యంతో వైటీపీసీని నిర్మించాలని నిర్ణయించారు. టెండర్లు పిలవకుండా, ఒత్తిడులకు తలొగ్గకుండా ఆ కాంట్రాక్టును బీహెచ్ఈఎల్కు అప్పగించారు. అప్పుల్లో కూరుకుపోతున్న ఆ సంస్థ ఊపిరి పీల్చుకొంటుందన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఇచ్చింది.
అయితే, ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిర్లక్ష్యం ప్రదర్శించాయి. ఎన్టీపీసీ సంస్థ.. 1,600 మెగావాట్ల రామగుండం ప్లాంటు నిర్మాణాన్ని దాదాపు మూడేండ్లు ఆలస్యం చేసింది. వైటీపీఎస్ నిర్మాణాన్ని బీహెచ్ఈఎల్ రెండేండ్లు ఆలస్యం చేసింది. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఎన్టీపీసీ ప్లాంటు పూర్తిస్థాయిలో విద్యుత్తును ఉత్పత్తి చేయాలంటే మరో సంవత్సరం కావాలంటున్నది. వైటీపీఎస్లోని అన్ని యూనిట్లు విద్యుత్తు ఉత్పత్తి చేయాలంటే మరో ఏడాది పట్టే అవకాశం ఉన్నది.
రామగుండంలో నిర్మిస్తున్న 1,600 మెగావాట్ల విద్యుత్తు ప్లాంటును కేంద్రమే మూడేండ్లు ఆలస్యం చేసింది. ఈ నేపథ్యంలో 800 మెగావాట్ల ప్లాంటు 85 శాతం పీఎల్ఎఫ్తో (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) రోజుకు 16.3 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుందని అనుకొందాం. ఇందులో తెలంగాణకు వచ్చేది 85 శాతమే. అంటే రోజుకు సుమారు 14 మిలియన్ యూనిట్లు అన్న మాట. ఈ లెక్కన ఏడాదికి సుమారు 5 వేల మిలియన్ యూనిట్లు. ఎన్టీపీసీలో రెండు యూనిట్లు ఉన్నందున ఏటా 10 వేల మిలియన్ యూనిట్ల చొప్పున మూడేండ్లకు మొత్తం 30,000 మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ నష్టపోయినట్టు లెక్క. వైటీపీఎస్ చివరి యూనిట్ ప్రారంభించేందుకు మరో ఏడాదిన్నర పడుతుంది.
ఈ లెక్కన సగటున ఒక సంవత్సరమే పరిగణనలోకి తీసుకొన్నా.. 800 మెగావాట్ల ఒక యూనిట్ రోజుకు 16.3 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మొత్తం 100 శాతం విద్యుత్తు తెలంగాణకే. ఈ లెక్కన ఏడాదికి ఒక యూనిట్ ద్వారా 6,000 మిలియన్ యూనిట్లు అన్న మాట. మొత్తం ఐదు యూనిట్ల ద్వారా 30 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును తెలంగాణ కోల్పోయినట్టే. రెండూ కలిపి 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును రాష్ట్రం కోల్పోయింది. ఆ యూనిట్ల మొత్తం విలువ రూ.30 వేల కోట్లు. ఈ నష్ట భారం తెలంగాణపై పడింది.