పాలకుర్తి రూరల్, ఏప్రిల్ 25 : దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తిలోని తన క్యాంప్ కార్యాలయంలో జనగామ జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లోని 50 మంది లబ్ధిదారులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఆటోలు, సెంట్రింగ్, కోళ్లఫారాలు కలిపి రూ.5 కోట్ల విలువైన యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దళితబంధువని కొనియాడారు.
అంబేద్కర్ తర్వాత దళితుల గురించి ఆలోచించిన మహాత్ముడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. మూడేండ్లలో రాష్ట్రంలోని దళిత కుటుంబాలన్నింటికీ దళితబంధు అందజేస్తామన్నారు. ఈ బడ్జెట్లో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లను కేటాయించిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గిరిజన రిజర్వేషన్ల పెంపునూ అడ్టుకొంటున్నదని విమర్శించారు. కార్యక్రమంలో కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.