హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఓవైపు సైబర్ నేరాలు పెరిగిపోతుంటే.. మరోవైపు ఆ స్థాయిలో సైబర్ సెక్యూరిటీ ఇచ్చే నైపుణ్యాలు మాత్రం సిబ్బందిలో ఉండటం లేదట. ఉత్తర అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ అండ్ కంట్రోల్ అసోసియేషన్ (ఐఎస్ఏసీఏ) నిర్వహించిన సర్వేలో వెల్లండైదీ విషయం. ఈ సంస్థ ప్రతి ఏటా సైబర్ సెక్యూరిటీ సర్వేను నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 2,031 సంస్థల ప్రతినిధులను ఆన్లైన్ ద్వారా సర్వే చేసింది. అందుకు సంబంధించిన రిపోర్టును స్టేట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ-2022 పేరుతో ఇటీవలే విడుదల చేసింది. సైబర్ సెక్యూరిటీల పనితీరు, అందుబాటులో ఉన్న మానవ వనరులు, సైబర్ ఆపరేషన్స్, ఆయా సంస్థల్లో భర్తీ చేయని సైబర్ సెక్యూరిటీ పోస్టుల వివరాలను వెల్లడించింది. సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవటం, నిలుపుకోవటంలో సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయని వివరించింది. ‘2020తో పోల్చితే 2021లో సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ 14 శాతం పెరిగారు. కానీ, నైపుణ్యాలు 11 శాతం తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణుల ఖాళీలను భర్తీ చేయని సంస్థలు 63 శాతం ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే అది 60 శాతం. నిపుణుల కోసం కంపెనీలు దాదాపు 3 – 6 నెలల సమయం తీసుకొంటున్నాయి. నైపుణ్యాల కొరత తీర్చేందుకు కంపెనీలే ఆసక్తి ఉన్న ఇతర విభాగాల్లోకి వారికి శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని కంపెనీలు రీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ పెడుతుంటే, ఇంకొన్ని కన్సల్టెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నాయి’ అని సర్వే వెల్లడించింది.
సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ నైపుణ్యాల లోటు
సాఫ్ట్ స్కిల్స్ 53 శాతం
క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ 48 శాతం
సెక్యూరిటీ కంట్రోల్స్పై పట్టు 42 శాతం గతేడాదితో పోల్చితే నిపుణుల్లో పెరిగిన నైపుణ్యాల గ్యాప్
క్లౌడ్ కంప్యూటింగ్ 51 శాతం
యాక్సెస్ నిర్వహణ 45 శాతం
డాటా రక్షణ 44 శాతం
క్రిటికల్ థింకింగ్ 53 శాతం
కమ్యూనికేషన్ స్కిల్స్ 52 శాతం
సమస్యను పరిష్కరించే నైపుణ్యం 44 శాతం