సిటీబ్యూరో, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ఏషియన్ ట్రేడర్స్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయంటూ నమ్మించాడు.. లక్షలు దోచేశాడు. ఇదేమిటని బాధితులు ప్రశ్నించారు. మీరు నాకు ఫోన్ చేస్తే మీ పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని ఓ సైబర్ ఛీటర్ బెదిరించడంతో చేసేదిలేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బంజారాహిల్స్కు చెందిన ఓ మహిళ పొదుపు సంఘం నిర్వహిస్తుంది. పొదుపు సంఘానికి సంబంధించిన డబ్బులను అమీర్పేట్లోని ఓ బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వెళ్లింది. అక్కడ కలిసిన ఒకరు మేము ఏషియన్ ట్రేడర్స్ యాప్లో పెట్టుబడి పెట్టాం.. మంచి లాభాలొస్తున్నాయని చెప్పి ఓ ఫోన్ నంబర్ ఇచ్చింది. దీంతో ఆ నంబర్కు ఫోన్ చేయడంతో తన పేరు కమల్ అని వైజాగ్లో ఉంటూ ముంబైలో ఉన్న ఏషియన్ ట్రేడర్స్ తరఫున ట్రేడింగ్ చేస్తున్నానంటూ నమ్మించాడు. మహిళ సెల్ఫోన్కు ఓ లింక్ పంపించి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి టెస్ట్ చేయమని సూచించాడు.
వెయ్యి డిపాజిట్ చేయగానే రెండు మూడు రోజుల పాటు రూ.40 లాభం వచ్చింది. దీంతో బాధితురాలు తమ స్నేహితులకు కూడా చెప్పి వారితో పెట్టుబడి పెట్టించింది. ఇలా రూ.7 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. అంతలోనే యాప్ క్లోజ్ అయ్యింది. దీంతో బాధితులు వైజాగ్లో ఉండే కమల్కు ఫోన్ చేయగా.. మీరు నాకు మళ్లీ ఫోన్ చేస్తే మీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటానంటూ నిందితుడు బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితులు చేసేది లేక సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బంజారాహిల్స్, డిసెంబర్ 15 : ఎయిర్టెల్ మొబైల్ నంబర్కు సంబంధించిన కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ నమ్మించిన సైబర్ నేరగాళ్లు బంజారాహిల్స్ రోడ్ నం 3లో నివాసముంటున్న అనూప్ రాజ్ సక్సేనా అనే విశ్రాంత ఉద్యోగికి రూ.69 వేలు బురిడీ కొట్టించారు. బాధితుడు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాచిగూడ, డిసెంబర్ 15 : ఇండాస్ల్యాండ్ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం.. మీ క్రెడిట్ కార్డు నంబర్ సవరించాలని చెప్పి కాచిగూడ నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన జంపాల విజయ్కుమార్ బ్యాంక్ ఖాతాలోనుంచి రూ.79,014 కాజేశారు. బాధితుడు కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై రాజేంద్రన్ తెలిపారు.