సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అకౌంట్ నంబర్ మారిందంటూ ఓ వ్యాపారికి ఈ మెయిల్ పెట్టిన సైబర్ నేరగాళ్లు రూ.7.91 లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం.. గోషామహల్కు చెందిన రాజేశ్ కేడియా మోలాసిస్ వ్యాపారి. ఇందులో భాగంగా కాకతీయ షూగర్స్ అండ్ షూగర్స్ కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకున్నారు. ఆ సమయంలో ఒక బ్యాంకు ఖాతాను పంపించి, డబ్బులు అందులో డిపాజిట్ చేయాలని సూచించారు. అయితే మరుసటి రోజే ఆ అకౌంట్కు వద్దని, మరో ఖాతాలో డిపాజిట్ చేయాలంటూ మరో ఈ మెయిల్ వచ్చింది. దీంతో రెండోసారి వచ్చిన బ్యాంకు ఖాతాలో రూ.7.9 లక్షలు డిపాజిట్ చేశారు. అయితే చెప్పిన సమయానికి సరుకు రాకపోవడంతో తాము డబ్బు చెల్లించామని, ఇంకా సరుకు పంపలేదంటూ ప్రశ్నించగా.. తమకు డబ్బు చేరలేదంటూ సదరు సంస్థ తెలిపింది. అయితే రెండోసారి వచ్చిన ఈ మెయిల్ సైబర్నేరగాళ్లు పంపించిందని నిర్ధారించుకున్న బాధితులు మంగళవారం సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
రోజుకు రూ.2 వేల నుంచి రూ. 3 వేలు సంపాదించవచ్చంటూ బహుదూర్పురాకు చెందిన విశాల్ జోషికి వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. దానికి స్పందించిన విశాల్ అవతలి వ్యక్తులకు ఫోన్ చేశాడు. మేం చెప్పినట్లు చేస్తే మీరు రోజు రూ.3 వేలు సంపాదిస్తారంటూ టెలిగ్రామ్ యాప్లో ఉన్న ఒక గ్రూప్లో అతడి నంబర్ యాడ్ చేశాడు. ఆ తరువాత అందులో ఇన్విస్ట్మెంట్ చేస్తే.. ఎలా లాభాలు సంపాదించవచ్చంటూ శిక్షణ ఇచ్చే ఒక ట్యూటర్ను కల్పించాడు. అతడి మాటలు విన్న విశాల్ దఫ దఫాలుగా రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే ఆ డబ్బు తిరిగి రాకపోవడంతో పాటు ట్యూటర్ కూడా గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యాడు. దీంతో ఇదంతా మోసమని గుర్తించిన విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గోల్నాక, ఆగస్టు 24 : బాగ్అంబర్పేట శ్రీనివాసకాలనీకి చెందిన రమేశ్ కుమారుడు అక్షయ్ బీటెక్ చదువుతున్నాడు. కాగా.. గత సోమవారం తన ఇంట్లో ఉన్న సోఫా సెట్ను ఓఎల్ఎక్స్ సైట్లో విక్రయానికి ఉంచాడు. అప్లోడ్ చేసిన ఐదు నిమిషాల్లోపే ఓ గుర్తు తెలియని నంబరు నుంచి ఫోన్ వచ్చింది. తాను నాంపల్లి నుంచి మాట్లాడుతున్నానని.. సోఫా సెట్ కొనుగోలు కోసం డబ్బులు చెల్లించడానికి క్యూఆర్కోడ్ పంపిస్తున్నామని అది స్కాన్ చేయాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన అక్షయ్ వెంటనే తన ఫోన్కు వచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగా.. తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.63వేలు పోయాయి. నగదు డ్రా చేసుకున్నట్లు మెసేజ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి మంగళవారం అంబర్పేట పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ తెలిపారు.