Jeera | సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ) : నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్నటి వరకు సలసలమంటూ నూనె ధరలు పెరుగగా..ఇప్పుడు వంటలో వినియోగించే ప్రధానమైన సుగుంద ద్రవ్యం జీలకర్ర (Jeera) ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కూరకు రుచిని అందించడంలో కీలకమైన జిలకర కొనడానికి బెంబేలెత్తాల్సిన దుస్థితి నెలకొంది. నగరంలో కేజీ జీలకర్ర ధర రూ. 540-560 ధర పలుకుతుండగా క్వింటాల్కు రూ.56వేల వరకు చేరిందని వ్యాపారులు తెలిపారు. రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోతే జీలకర్ర ధరలు మరింతగా ప్రియం కానున్నాయని వివరించారు.
తాజాగా కెడియా కమోడిటి (కెడియా అడ్వైజరీ) రీసెర్చ్ ప్రకారం జిలకర ధరలు ఈ ఏడాది 50శాతం వరకు పెరిగాయని వెల్లడించింది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న జీలకర్రకు గ్లోబల్ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది. ముఖ్యంగా గత మూడు వారాల్లో భారత్ నుంచి 300- 350 కంటెయినర్ల జీలకర్రను చైనా దిగుమతి చేసుకుంది. బంగ్లాదేశ్ కూడా గణనీయమైన జిలకరను కొనుగోలు చేసిందని రిపోర్ట్ పేర్కొంది. ఓవైపు దేశంలో జీలకర్ర సాగు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు మరోవైపు విదేశాలు జీలకర్ర దిగుమతిలో పోటీపడుతుండటం కూడా ధరలు పెరగడానికి కారణమైంది.
సాధారణంగా జీలకర్ర పంట అనగానే ప్రపంచంలో మొదటగా గుర్తొచ్చేది భారత్ పేరే. ప్రపంచ వ్యాప్తంగా జిలకర పంట ఉత్పత్తిలో 70శాతం వాటా భారత్ది కాగా, ఆ తర్వాత సిరియా 13 శాతం, టర్కీ 5 శాతం, ఇతరులు 6 శాతం చొప్పున వాటాను కలిగి ఉన్నాయి. దేశంలో పరిశీలిస్తే.. జీలకర్ర పంట అంటే గుజరాత్, రాజస్తాన్ పేర్లు వినిపిస్తాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రమైన గుజరాత్లో హోల్సేల్ ధర క్వింటాల్కు రూ.56వేలుకు చేరింది. ఆ తర్వాత అధికంగా సాగుచేసే రాజస్తాన్లోనూ దిగుబడి తగ్గింది. డిమాండ్ మేర సరఫరా లేకపోవడంతో జీలకర్ర ధరలు పెరిగాయని నిపుణులు చెబుతున్నారు.
సిరియా వంటి ఇతర దేశాల్లో ఉత్పత్తి తగ్గుదల కారణంగా మొత్తం ఎగుమతులు పెరిగాయని తెలిపారు. ఫలితంగా ఇతర దేశాల నుంచి డిమాండ్ పెరిగింది. కెడియా రిపోర్ట్ ప్రకారం సిరియా, అఫ్ఘనిస్తాన్ నుంచి తాజా పంట జూన్ 15-20 మధ్య ప్రారంభమవుతుంది. అఫ్ఘనిస్తాన్లో జీలకర్ర పంట గత ఏడాది కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. వచ్చే నెలలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే సిరియాలోని జీలకర్ర వ్యాపారులు 20 వేల నుంచి 30 వేల టన్నుల పంటను అందుబాటులో ఉంచనున్నారు. దీంతో ధరలు కొంత మేర తగ్గుతాయని మార్కెట్ రంగాలు విశ్లేషిస్తున్నాయి. చైనా భారీ డిమాండ్తో దేశంలోని ప్రాసెసింగ్ సెంటర్లలో జిలకర స్టాక్ గణనీయంగా తక్కువగా ఉన్నట్టు కెడియా కమోడిటి నివేదిక తెలిపింది.