హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో క్యూబా ట్రేడ్ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్తో కలిసి ఆ దేశ రాయబారి అలెగ్జెండ్రో మారిన్ దీన్ని ఆవిష్కరించారు. శుక్రవారం హెచ్ఐసీసీలో నిర్వహించిన ఇండియా, క్యూబా సమ్మిట్-2022కు మారిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, క్యూబా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చేందుకు ట్రేడ్ సెంటర్ను ప్రారంభించినట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ, పర్యాటక, వ్యాపార సంబంధాలను మరింత విస్తరిస్తామన్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్యూబా పర్యటన తర్వాత ఇరు దేశాల మధ్య అన్ని రంగాల్లో సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. క్యూబాలో పునరుత్పాదక శక్తి, ఔషధ, వైద్య, ఐటీ, పారిశ్రామికాభివృద్ధి తదితర రంగాల్లో వ్యాపార, వాణిజ్యాలకు భారీగా అవకాశాలున్నాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్, చక్కెర, సిగార్, కాఫీ ఉత్పత్తుల దిగుమతులకు భారత్ అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో అభివృద్ధికి హైదరాబాద్ వేదిక కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఐటీ రంగం గణనీయంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని విస్తరించేందుకు అవకాశాలున్నాయని చెప్పారు. పెట్టుబడులకు రాష్ట్ర వాణిజ్య విధానం ఎంతో అనుకూలమని వివరించారు. కాగా, లాటిన్ అమెరికన్ కరేబియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఏసీఎఫ్ఐ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల క్యూబా ట్రేడ్ కమిషనర్గా డాక్టర్ మూర్తి దేవరబొట్లకు ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో క్యూబా మిషన్ డిప్యూటీ చీఫ్ అబెల్ డెస్పజైన్, ఏంఈఏ హెడ్ దాసరి బాలయ్య, ఐపీఎస్ అధికారి శ్రీధర్రావు, కో-ఆర్డినేటర్ తస్మీన్, ఆయా వ్యాపార రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.