జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్స్మెన్ సంచలన ప్రదర్శన చేస్తున్నారు. అలవోకగా భారీ ఇన్నింగ్స్లు ఆడేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 50 ఓవర్లలో 9 వికెట్లకు 321 పరుగులు చేసింది. ముంబై బౌలర్, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు శార్దుల్ ఠాకూర్(92: 57 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్(91: 75 బంతుల్లో 15ఫోర్లు), తారే(83) రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో హిమాచల్ ప్రదేశ్ 24.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై 200 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. మయాంక్ దాగర్(38) టాప్ స్కోరర్. ముంబై బౌలర్లలో ప్రశాంత్ సోలంకీ నాలుగు వికెట్లు తీయగా శామ్స్ ములానీ మూడు, ధవల్ కులకర్ణి రెండు వికెట్లు పడగొట్టాడు.