హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఆదివారం బీఆర్కే భవన్లో విత్తన ఉత్పత్తి కంపెనీలతో సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలైన పప్పుధాన్యాలు, నూనె గింజల విత్తనాలు తగిన పరిమాణంలో సేకరించి నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. తెలంగాణలో వేరు శెనగ, పచ్చి శెనగ, నల్ల శెనగ, బెంగాల్ గ్రామ్, ఆముదం, సజ్జలు, సీసమ్ తదితర పంటలు, నూనె గింజలు యాసంగిలో సాగుకు అనుకూలమని పేర్కొన్నారు. యాసంగి సీజన్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వరిధాన్యం కొనుగోలు చేయడం లేదన్న సంగతి తెలిసిందే.
ఎఫ్సీఐ నిర్ణయం మేరకు.. ప్రత్యామ్నాయ పంటలపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు సీఎస్ తెలిపారు. వ్యవసాయ క్లస్టర్లలో 2,603 రైతు వేదికల ద్వారా యాసంగి సీజన్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులతో ప్రత్యామ్నాయ పంటలపై క్లస్టర్ స్థాయిలో ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు ముమ్మర ప్రచారం నిర్వహిస్తారన్నారు. ఈ క్రమంలో రైతులకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉండాలని విత్తన కంపెనీలను కోరారు. సమావేశంలో ఆయాశాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.