హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): రానున్న కాలంలో మరింతగా సైబర్ మోసాలు, హ్యాకింగ్ దాడులు జరిగే అవకాశాలున్నాయని నార్టన్ ల్యాబ్స్ అనే సంస్థ వెల్లడించింది. 2022లో ప్రధానంగా జరగనున్న సైబర్ మోసాల ట్రెండ్స్ను గురువారం తాజా నివేదికను విడుదల చేసింది. ప్రధానంగా క్రిప్టోకరెన్సీ మోసాలు భారీగా పెరిగే ప్రమాదం ఉన్నట్టు వెల్లడించింది. రానున్న ఏడాదిలో చాలా వరకు కంపెనీల కొనుగోళ్లు, అమ్మకాలకు ఈ అదృశ్య కరెన్సీని వాడే అవకాశాలున్నాయని, అదే సమయంలో ఈ కరెన్సీ వాడకంలో పూర్తిగా అవగాహన లేకపోవడం స్కామర్లకు కలిసి వచ్చే అవకాశంగా మారబోతుందని హెచ్చరించింది. మరోవైపు సైబర్ టెర్రరిజం సైతం పెరుగుతోందని హెచ్చరించింది. అదేవిధంగా నకిలీ వీడియోలు, ఫొటోల మార్ఫింగ్ వంటి డీఫ్ ఫేక్ టెక్నాలజీలు సైతం పెరిగి ప్రమాదం ఉన్నట్టు నార్టన్ ల్యాబ్స్ నివేదిక వెల్లడించింది.