Crude Oil : అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా ముడి చమురు (Crude Oil) ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 90 డాలర్ల మార్క్ను దాటింది. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మీదుగా చమురు సరఫరాలకు అంతరాయం కలుగవచ్చనే ఆందోళనతో మార్కెట్లలో కొనుగోళ్లు పెరిగాయి. దాంతో గత రెండు రోజులుగా చమురు ధరలు వరుసగా ఎగబాకుతున్నాయి.
సోమవారం బ్రెంట్ క్రూడ్ ధర దాదాపు మూడు శాతం పెరిగి బ్యారెల్కు 90 డాలర్లు దాటింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో కూడా ఇదే స్థాయిలో పెరుగుదల నమోదైంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ కూడా 3.5 శాతానికి పైగా పెరిగి బ్యారెల్కు 85.39 డాలర్ల వద్ద ట్రేడైంది. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్) లో ఆగస్టు క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు కూడా జోరందుకున్నాయి.
ఉదయం ట్రేడింగ్లో బ్యారెల్కు రూ.210 పెరిగి రూ.8,120 ఇంట్రాడే గరిష్ఠస్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావమే దేశీయ ధరలపైనా కనిపించింది. వారాంతంలో అమెరికా, ఇరాన్ మధ్య సైనిక చర్యలు మరింత తీవ్రం కావడం మార్కెట్లను కలవరపరిచింది. ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో లేదని టెహ్రాన్ ప్రకటించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. వరుసగా తొమ్మిదో రోజు ఇరాన్లోని లక్ష్యాలపై దాడులు నిర్వహించినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
వాణిజ్య నౌకలు, పౌర నౌకలపై దాడులకు తెగబడుతున్న ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీనపర్చడమే తమ లక్ష్యమని తెలిపింది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో నాలుగు నౌకలను అడ్డుకున్నట్లు ఇరాన్ నౌకాదళం వెల్లడించింది. వాటిలో రెండు ప్రమాదాలకు గురికాగా, మరో రెండు వెనక్కి వెళ్లిపోయినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ముడిచమురు ధరలు సమీప కాలంలో బలంగానే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.