కోల్కతా: ఒక్కరోజులో బండ్లు ఓడలు అవొచ్చు లేదా ఓడలు బండ్లు అవొచ్చు అనే సామెత తెలుసు కదా! పశ్చిమబెంగాల్లోని తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన షేక్ హీరా అంబులెన్స్ డ్రైవర్ విషయంలో ఇది నిజమైంది. అరకొర జీతంతో ఇబ్బందులు పడుతున్న అతనికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. గంటల వ్యవధిలోనే కోటీశ్వరుడు అయిపోయాడు. రూ.270 పెట్టి ఉదయం లాటరీ టికెట్టు కొన్న అతను మధ్యాహ్నానికి రూ.కోటి జాక్పాక్ కొట్టేశాడు. ఇంత భారీ మొత్తంలో డబ్బు గెలుచుకోవడంతో షాక్కు గురైన హీరా అభ్యర్థన మేరకు శక్తిఘర్ పొలీసులు అతని ఇంటి బయట భద్రత ఏర్పాటు చేశారు. గెలుచుకున్న డబ్బుతో అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి వైద్యం చేయిస్తానని, కొత్త ఇంటిని నిర్మించుకొంటానని షేక్ హీరా చెప్పాడు. అనేక రోజులుగా లాటరీ టికెట్లు కొంటున్నానని, ఈ రోజుకు అదృష్టం తన తలుపు తట్టిందని ఆనందం వ్యక్తం చేశాడు.