హైదరాబాద్/సూర్యాపేట, జనవరి 16 (నమస్తే తెలంగాణ): పండుగ పూట రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల, ఆకస్మిక వర్షాలు దంచికొట్టాయి. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజిగిరి, సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలుచోట్ల వాన దంచికొట్టింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఆరు గంటల పాటు కుండపోత కురిసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆరు గంటల్లో 14.5 సెంటీమీటర్ల వర్షం పడింది. సూర్యాపేటలో గత 20 ఏండ్లలో ఇదే రికార్డు స్థాయి వర్షం. అత్యధికంగా సూర్యాపేట జిల్లా ఎర్కారంలో 14.58 సెంటీమీటర్లు, నల్లగొండ జిల్లా నకిరేకల్లో 11.70, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రాలో 11.68 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది.
స్థానికంగా ఏర్పడిన మిజోస్కేల్ సర్క్యులేషన్ (ప్రాంతీయ వాయుగుండం) ఇందుకు కారణమని వాతావరణ నిపుణులు రామారావు తెలిపారు. శనివారం కొంకణ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, తుఫాన్ ప్రభావంతో పాటు అరేబియా సముద్రం నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాష్ట్రంలోకి భారీ ఎత్తున తేమ వచ్చిందని, అందువల్ల మిజోస్కేల్ సర్క్యులేషన్ ఏర్పడిందని వివరించారు. దీనిని ముందుగా గుర్తించలేమని, కేవలం ఆరు గంటల స్వల్ప వ్యవధిలో మాత్రమే అంచనా వేయగలమని చెప్పారు.
అకాల వర్షాలకు ఆయా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఈ నెల 11 నుంచి ఆదివారం వరకు ఆరు రోజుల్లో 34.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్టు టీఎస్డీపీఎస్ పేర్కొన్నది. రాష్ట్రంలో అత్యధికంగా వరంగల్ జిల్లాలో 126.6 మిల్లీమీటర్లు, ములుగు జిల్లాల్లో 72.1, మహబూబాబాద్ జిల్లాలో 70.1, జనగామ జిల్లాలో 63.4 మిల్లీ మీటర్ల సగటు వర్షం కురిసినట్టు వెల్లడించింది. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయి.
రాష్ట్రంలోనే అత్యల్పంగా రాత్రి ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 12.7 డిగ్రీల సెల్సియస్, అత్యధిక పగటి ఉష్ణోగ్రత వనపర్తి జిల్లా శ్రీరంగపూర్ 33.3 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. కొంకణ్ తీరంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆరేబియా సముద్రంలోకి వెళ్లి పోవడంతో సోమవారం నుంచి రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం తెలిపింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
మూసీకి 4136 క్యూసెక్కుల ఇన్ఫ్లో
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆదివారం నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరిగింది. ఎగువ నుంచి 4,136.18 క్యూసెక్కుల నీరు రావడంతో ప్రాజెక్టు 3 క్రస్టుగేట్లను ఎత్తి దిగువకు 6,014 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుతం 644.85 అడుగులు ఉన్నట్టు ప్రాజెక్టు ఏఈ డీ ఉదయ్కుమార్ తెలిపారు.