లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడతలో భాగమైన 57 స్థానాలకు గురువారం పోలింగ్ జరుగనున్నది. ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న 676 మంది అభ్యర్థుల్లో దాదాపు 27 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికలు జరుగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడింట రెండొంతుల స్థానాలను రెడ్ అలర్ట్గా ప్రకటించారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) ఈ మేరకు నివేదిక విడుదల చేసింది. మొత్తం 57 స్థానాల్లో 37 స్థానాలను రెడ్ అలర్ట్గా ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. అంటే ఒక నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్థుల్లో ముగ్గురి కన్నా ఎక్కువ మందిపై క్రిమినల్ కేసులు ఉంటే ఆ సీట్లను రెడ్ అలర్ట్ స్థానాలుగా ప్రకటిస్తారు. 670 మందిలో 182 మందిపై (27 శాతం) క్రిమినల్ కేసులు ఉండగా, 151 మంది (23 శాతం)పై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎస్పీకి చెందిన 40 మందిపై, బీజేపీకి చెందిన 23 మందిపై, కాంగ్రెస్కు చెందిన 22 మందిపై, బీఎస్పీకి చెందిన 22 మందిపై, ఆప్కు చెందిన ఏడుగురిపై క్రిమినల్ సాధారణ కేసులు ఉన్నాయి. 29 మంది ఎస్పీ అభ్యర్థులు, 20 మంది చొప్పున, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు, ఐదుగురు ఆప్ అభ్యర్థులపై తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. మొత్తం అభ్యర్థుల్లో 253 మంది (38 శాతం) కోటీశ్వరులు ఉన్నారు. ఈ దఫా ఎన్నికల్లో కేవలం 10 శాతం మంది మహిళలకు మాత్రమే టికెట్లు ఇచ్చారు.
ఆరో విడతలో ఎన్నికల్లో పోటీచేసే ప్రధాన అభ్యర్థుల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్ నేత అజయ్కుమార్ లల్లూ, సమాజ్వాదీ పార్టీకి చెందిన స్వామీ ప్రసాద్ మౌర్య ఉన్నారు. పూర్వాంచల్ ప్రాంతంలోని అంబేడ్కర్నగర్, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్నగర్, మహారాజ్గంజ్, గోరఖ్పూర్, కుశీనగర్, దేవరియా, బలియా జిల్లాల్లో ఈ స్థానాలున్నాయి. 403 స్థానాల్లో 292 స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మిగిలిన 111 స్థానాల్లో 57 స్థానాలకు గురువారం, మిగిలిన 54 స్థానాలకు పదోతేదీ పోలింగ్ జరుగుతుంది.