హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నిజ స్వరూపాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బట్టబయలు చేశారని, కేంద్రం వైఖరిని ఎండగట్టడం హర్షణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం కొనుగోలు చేసినా, చేయకపోయినా వానకాలంలో మొత్తం పంటను కొనుగోలు చేస్తామని సీఎం ప్రకటించడం శుభ పరిణామమని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలకు, కేంద్ర ప్రభుత్వ విధానాలకు పొంతన లేదని మండిపడ్డారు. రాష్ట్ర బీజేపీ నేతలు చౌకబారు విమర్శలు మానుకొని, యాసంగి పంటను కొనుగోలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని హితవు చెప్పారు. పంట కొనుగోళ్ల విషయంలో కేంద్రం దాగుడు మూతలు ఆడటం, సస్పెన్స్లో ఉంచడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రం కేరళతో చర్చలు జరిపి, మన బియ్యం విక్రయించేందుకు ప్రయత్నించాలని సూచించారు.
రాజ్యసభ నుంచి సీపీఐ ఎంపీ వినయ్ విశ్వం సహా 12 మంది ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు ఒప్పుకొని మూడు రైతు చట్టాలను ఉపసంహరించుకున్న కేంద్రానికి ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసే నైతికహక్కు ఎక్కడున్నదని ప్రశ్నించారు.