న్యూఢిల్లీ : దేశంలో త్వరలోనే 12 ఏళ్లుపైబడిన పిల్లలకు కొవిడ్ టీకా వేయనున్నారు. జైడస్ క్యాడిలా రూపొందించిన టీకాను జాతీయ కొవిడ్ టీకా డ్రైవ్లోకి ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం తెలిపింది. ధర ఇంకా నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో భిన్నంగా ఉంటుందని పేర్కొంది. 12 ఏళ్లు పైబడిన పిల్లలతో పాటు పెద్దల కోసం జైడస్ క్యాడిలా జైకోవ్-డీ పేరుతో వ్యాక్సిన్ తయారు చేసింది. ఇప్పటికే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా గత నెల 20న అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది.
గురువారం ఆరోగ్యమంత్రిత్వ శాఖ బ్రీఫింగ్లో హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ మాట్లాడుతూ జైడస్ వ్యాక్సిన్ను అతిత్వరలో జాతీయ టీకా డ్రైవ్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇంకా తేదీ నిర్ణయించలేదని, మూడు డోసుల టీకా కావడంతో ధర ఇతర టీకాలకంటే భిన్నంగా ఉంటుందని వివరించారు. గతవారం నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ సైతం జైడస్ టీకా డ్రైవ్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు.
జైకోవ్ ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ ఆధారంగా రూపొందించిన మొదటి టీకా. కేంద్రానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ) ‘మిషన్ కొవిడ్ సురక్ష’ కింద జైడస్ క్యాడిలాతో కలిసి టీకాను అభివృద్ధి చేసింది. సూది వినియోగించకుండానే ఫార్మజెట్ అనే సాధనం ద్వారా చర్మంలోకి వ్యాక్సిన్ను ప్రవేశపెట్టనున్నారు.