శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో కరోనా ఉధృతి పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం వైరస్ కట్టడి చర్యలకు ఉపక్రమించింది.
ఇందులో భాగంగా రెండు వారాలపాటు కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 9వ తరగతి వరకు అన్నీ పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది.
దీంతో రేపటి నుంచి ఈ నెల 18 వరకు పాఠశాలలు మూతపడనున్నాయి. 10 నుంచి 12 తరగతి వరకు విద్యార్థులకు సైతం వారంపాటు ప్రత్యక్ష తరగతులను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
కేంద్ర పాలిత ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతుండటం.. చాలామంది యుక్త వయసు విద్యార్థులు వైరస్ బారినపడుతుండటంతో పాలనా యంత్రాంగం ఈ నిర్ణయించింది.
సామాజిక, ఆచార వ్యవహారాలకు సంబంధించిన వేడుకలపైనా అధికారులు ఆంక్షలు విధించారు. భౌతికదూరం పాటిస్తూ 200 మందికి మించకుండా నిర్వహించుకోవాలని సూచించారు.
కొన్నివారాలుగా జమ్మూకశ్మీర్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. పలు జిల్లాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వైరస్ బారినపడటంతో కొన్నివారాల క్రితమే చాలా పాఠశాలలు మూతపడ్డాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి