ఖైరతాబాద్, డిసెంబర్1: సోమాజిగూడ డివిజన్లోని ఎంఎస్ మక్తా రసూల్ బాయ్ గల్లీ దిగువ ప్రాంతంగా ఉండడంతో వర్షాలు కురిసినప్పుడల్లా ముంపునకు గురవుతుంది. దశాబ్దాలుగా వారు ఆ సమస్యను ఎదుర్కొంటున్నారు. 20 సంవత్సరాల క్రితం సాగర్ వద్ద ఉన్న ఎఫ్టీపీ ప్రాం తంలో రెండు బావులను తవ్వించారు. వర్షాలు పడితే ఆ నీరంతా అందులో నిండేవి. అనంతరం అధిక సామర్థ్యం కలిగిన మోటార్లు అక్కడ అమర్చడంతో వాటిని పంపింగ్ చేసే వారు. ఆ మోటార్లు మురుగునీటితో పాటు మట్టిని తోడిపడేసేవి. నాలుగు సంవత్సరాల క్రితం ఆ మోటార్లు చెడిపోయాయి. దీంతో తాత్కాలికంగా డీజిల్ మోటార్లు పెట్టి పనినడిపిస్తున్నారు. అక్కడ నిర్మించిన బావుల్లో టన్నుల కొద్ది వ్యర్థాలు, మట్టి పేరుకుపోవడంతో అంతంత మాత్రమే సామర్థ్యం కలిగిన మోటార్లు వాటిని తొలగించలేకపోతున్నది. ఫలితంగా వర్షాలు పడినప్పుడల్లా మురుగునీరు మొత్తం వెనక్కి వచ్చి కాలనీని ముంచెత్తుతున్నది.
ఎమ్మెల్యే దానం నాగేందర్ తన నిధులలో రూ.50 లక్షలు మంజూరు చేయగా, రెండు నెలల క్రితం 2 కొత్త మోటార్లను కొనుగోలు చేశారు. అయితే ముందుగా 15 అడుగు ఎత్తులో ఆ బావుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు, మట్టితొలగించాల్సి ఉంది. వాటిని జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ సమన్వయంతో తొలగించాల్సి ఉంది. అయితే ఇక్కడి సిబ్బందితో పూర్తిగా పనులు జరుగకపోవడంతో కోల్కత్తా నుంచి ప్రత్యేకంగా కార్మికులను రప్పించారు. ప్రస్తుతం ఒక్క డీసీఎం మట్టిని మాత్రమే తొలగించగా, ఇంకా 15కు పైగా డీసీఎం మట్టిని తీయాల్సి ఉండగా, రెండు నెలలుగా ఆ పనులు నత్తనడకన సాగుతున్నాయి. తొలగించిన వ్యర్థాలు అక్కడే ఉంచడంతో కాలనీకి దుర్గంధం వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయించాలి
-వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ ,సోమాజిగూడ
మోటార్లు కొనుగోలు చేసి రెండు నెలలు కావస్తోంది. పనులు వేగంగా సాగకపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేలా ఉన్నాధికారులు చొరవ తీసుకోవాలి.