Corona Virus | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో, 1590 మందికి వైరస్ సోకింది. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గత ఐదువారాల్లో దేశంలో కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని ఫోర్ ‘టీ’ (టెస్ట్, ట్రాక్, ట్రీట్-టీకా)పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 సబ్వేరియంట్గా భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఢిల్లీలో శుక్రవారం 152 కొత్త కరోనావైరస్ కేసులు 6.66 శాతం పాజిటివ్ రేటుతో నమోదయ్యాయి. అంతకుముందు అక్టోబర్లో ఢిల్లీలో ఒకే రోజులో 100 కేసులు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలోనూ శుక్రవారం 343 కొవిడ్ కేసులు నమోదవగా.. ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,763కి చేరింది. ఇదిలా ఉండగా.. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,600 కంటే ఎక్కువగా నమోదయ్యాయి.
కొవిడ్ కేసులు ఫిబ్రవరి రెండు-మూడో వారంలో 108-115 కేసులు నమోదవగా.. మూడోవారం నాటికి వెయ్యి మార్క్ను దాటాయని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఒక నివేదికలో తెలిపారు. కొత్త వేరియంట్ల కారణంగా పలువురిలో లక్షణాలు కనిపించడం లేదని కొవిడ్ కేర్ నిపుణుడు డాక్టర్ నరోత్తమ్ సింగ్ పేర్కొన్నారు. లక్షణాలు కనిపించకపోవడంతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, దేశంలో కేసులు అకస్మాత్తుగా పెరగడానికి ఇదే ఓ కారణమని చెప్పారు.