హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం 1,673 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,165, మేడ్చల్ మల్కాజిగిరిలో 292, రంగారెడ్డిలో 123, సంగారెడ్డిలో 44, హనుమకొండలో 34 కేసులు వెలుగు చూశాయి. మొత్తం 48 వేల టెస్టులు నిర్వహించగా 3.44 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. క్రితం రోజుతో పోల్చుకొంటే కేసుల సంఖ్య తగ్గినప్పటికీ, పాజిటివిటీ స్థిరంగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా 330 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 13 వేలు దాటినట్టు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ పేర్కొన్నది.
77 వేల మందికి టీకాలు
ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 77 వేల మందికి టీకాలు వేశారు. ఇందులో 28 వేల మందికి మొదటి డోస్, 49 వేల మందికి రెండో డోస్ ఇచ్చారు. 15-18 ఏజ్ గ్రూప్లో ఇప్పటివరకు టీకాలు పొందినవారి సంఖ్య 6,97,335కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35.23 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్లో కలిపి 54,601 పడకలు అందుబాటులో ఉన్నాయి.