సిటీబ్యూరో, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): దసరాలోపు కొత్త సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టీపీ) నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. నూతనంగా చేపడుతున్న ఎస్టీపీల నిర్మాణంపై బుధవారం ఖైరతాబాద్లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్యాకేజ్-3 కింద నిర్మించనున్న 17 ఎస్టీపీల పురోగతిని ఆయన అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. భూ వివాదాలు లేకుండా భూమి అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఎస్టీపీల నిర్మాణానికి ప్రణాళికలను వెంటనే ఖరారు చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా సాయిల్ టెస్ట్లను కూడా పూర్తి చేయాలని చెప్పారు. పక్కా ప్రణాళికలతో 24 గంటలు పనులు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. మూడు షిఫ్ట్ల్లో కార్మికులు ఉండేల చూసుకోవాలని సూచించారు. కొన్ని చోట్ల స్థలాభావం ఉన్న కారణంగా ఎస్టీపీల సామర్థ్యాన్ని తగ్గించవద్దని దానకిషోర్ అధికారులకు సూచించారు. నిర్మాణ పనుల్లో కచ్ఛితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆైన్లెన్ మానిటరింగ్ కోసం జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని అన్నారు. నిర్మాణంలో కార్మికుల రక్షణకు కూడా ప్రథమ ప్రాధాన్యతనివ్వాలని చెప్పారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ డా.ఎం. సత్యానారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు పాల్గొన్నారు.