తిరుపతి : ప్రపంచ హిందువుల రాజధాని అయిన తిరుమల తిరుపతి దేవస్థానాలపై కుట్రపూరిత అజెండాతో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మిజోరం – మయన్మార్ సరిహద్దుల్లో కస్టమ్స్ అధికారులు, అస్సాం రైఫిల్స్ సీజ్ చేసిన తలనీలాలతో ఎటువంటి సంబంధం లేకపోయినా, టీటీడీని, రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి కొందరు వ్యక్తులు సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలోను అవాస్తవాలను ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని చెప్పారు.
తలనీలాల సీజ్కు సంబంధించి కస్టమ్స్, అస్సాం రైఫిల్స్ అధికారులు స్థానిక పోలీసులకు అందించిన నివేదికను ఆయన మీడియాకు విడుదల చేశారు. టీటీడీ అధికారులు కుమ్మక్కై తలనీలాలను అక్రమ రవాణా చేసినట్టు అభూతకల్పనలు చేశారని చెప్పారు.
ఫిబ్రవరి 8న మిజోరంలో సీజ్ చేసిన రూ.18,17,089/- విలువ చేసే తుక్కు తలవెంట్రుకలకు సంబంధించి అధికారులు పోలీసులకు ఇచ్చిన రిపోర్టులో ఎక్కడా టీటీడీ పేరే లేదని ఆయన స్పష్టం చేశారు.
పైగా సీజ్ చేసిన తలనీలాలు ప్రాసెస్ చేయనివిగా అందులో పేర్కొన్నట్టు తెలిపారు. టీటీడీలో తలనీలాల సేకరణ, వాటి ప్రాసెసింగ్, ఈ-వేలం ప్రక్రియను నిర్వహించడానికి పటిష్టమైన వ్యవస్థ ఉందని, ఇది పారదర్శకంగా పనిచేస్తుందని ఆయన చెప్పారు.
కల్యాణకట్ట, విజిలెన్స్ విభాగాల అధికారులు, సుమారు 1200 మంది క్షురకులను ఇంటిదొంగలుగా ఆరోపించి వారిపై బురదచల్లారని చెప్పారు. ఈ-వేలంలో కూడా అవకతవకలు జరిగినట్టు తప్పుడు చేశారని, ఏప్రిల్లో నిర్వహించేచే ఈ-వేలానికి ఈ ఆరోపణలు చేసిన మీడియా ప్రతినిధులు హాజరై తలనీలాలు ఎలా విక్రయిస్తారో సిండికేట్కు, అక్రమాలకు అవకాశం ఉందేమో పరిశీలించుకోవచ్చన్నారు.
టీటీడీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తులపై, మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ధర్మారెడ్డి తెలిపారు.