హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): తన కుమారుడు వనమా రాఘవపై కొందరు కుట్రలు చేశారని, వారి పేర్లను త్వరలోనే బయటపెడతానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు చెప్పారు. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కావాల్సిన తన కుమారుడిపై కుట్ర చేసి రాజకీయ భవిష్యత్తు ఆగం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని, తాను ఆరోగ్యంగా ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పారు. నియోజకవర్గంలో నిత్యం తిరుగుతున్నానని, తన కుమారుడిపై కుట్రలు చేసినవారి బండారం బయటపెడుతానని వనమా వెంకటేశ్వర్రావు ప్రకటించారు.