న్యూఢిల్లీ, నవంబర్ 29: పనిచేయడానికి లోక్సభ ఆకర్షణీయమైన స్థలం కాదని ఎవరన్నారు.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ ఆరుగురు మహిళా ఎంపీలతో కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. శశి థరూర్ స్త్రీలోలుడంటూ, మహిళలను అందమైన వస్తువులుగా చూస్తున్నారంటూ నెటిజన్లు ఆయనను తీవ్రంగా విమర్శించారు. థరూర్ ట్వీట్పై జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ మండిపడ్డారు. ‘మహిళలను ఆకర్షణీయమైన, అందమైన వస్తువులుగా శశి థరూర్ భావిస్తున్నారు. అలా చేయడం మానుకోండి. మహిళలంటే కేవలం అందమే కాదు’ అని అన్నారు. దీనిపై శశి థరూర్ క్షమాపణలు తెలిపారు. ఆ మహిళా ఎంపీలు కోరడం వల్లే ఫొటో దిగానని, వారు అడగడం వల్లే ట్వీట్ చేశానని, ఇదంతా చాలా హాస్య పూరితంగా జరిగిన అంశం అని చెప్పారు. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. ఫొటోలో ఎంపీలు సుప్రియా సూలే, ప్రణీత్ కౌర్, తమిళచ్చి తంగపాండియన్, మిమీ చక్రవర్తి, నుస్రత్ జహాన్, జ్యోతిమణి ఉన్నారు. ఇదిలా ఉండగా, థరూర్ను టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సమర్థించారు. ప్రభుత్వ విధానాలపై చర్చ జరగకుండా ఇలాంటి వాటిని ముందుకు తెస్తారని తనకు తెలుసన్నారు.