టేక్మాల్: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక అర్హత ( No Moral Right ) లేదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్( Former MLA Kranthi Kiran ) అన్నారు. ఆ పార్టీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ 1000 రోజుల దగాపై బీఆర్ఎస్ సమరభేరి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయం విధ్వంసంపై టేక్మాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప అధ్యక్షతన గురువారం రైతు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే టేక్మాల్ చౌరస్తాలోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నిర్వహించిన రైతు సదస్సులో ఆయన మాట్లాడారు.

రైతుల గోడును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలతో రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నామని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగక, క్వింటాళ్ల కొద్దీ తరుగు పేరుతో రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆరోపించారు.
మహిళలకు నెలకు రూ. 2,500 ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్న హామీ అతీగతీ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై సచివాలయ ఉద్యోగుల నుంచి ఉపాధ్యాయులు, అంగన్వాడీలు, రైతుల వరకు అందరూ రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన బాండ్ పేపర్ల హామీల ఆధారంగా రూపొందించిన బాకీ కార్డులను ప్రతి గ్రామంలోని ఇంటింటికీ పంపిణీ చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జైపాల్ రెడ్డి, విజయ్, పీఏసీఎస్ ఛైర్మన్ యశ్వంత్ రెడ్డి, నాయకులు సిద్దయ్య, సలీం, భాస్కర్, బసంతరావు, రవి, గోవిందచారి, మాజీ ఎంపీపీ చింత స్వప్న, మాజీ ఎంపీటీసీ మోహన్, మాజీ సర్పంచులు భక్తుల వరలక్ష్మి, నాయికోటి సుప్రజ, సంగయ్య, శ్రీనివాస్, రాజు, మల్లేశం, తదితరులు ఉన్నారు.