ఆర్మూర్టౌన్, జూన్ 20: రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. రైతు సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకు చిన్నచూపు అని ప్రశ్నించారు. శనివారం ఆయన పట్టణంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి కాదని, హిట్లర్ రెడ్డి అని విమర్శిచారు. మోదీ, చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు హిట్ అయినంత మాత్రాన ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటే అది భ్రమేనని అన్నారు. పాన్ డబ్బాల లెక్క పది పార్టీలు పుడితే అందులో ఒక తోక పార్టీ జనసేన అని పేర్కొన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు మిత్రుడిగా రైతుబంధు అందిస్తే, రేవంత్ రెడ్డి బూతు బంధుగా మారాడని దుయ్యబట్టారు. రైతులు, ఉద్యోగులు నిరుద్యోగుల పాలిట రేవంత్ రెడ్డి ఒక హిట్లర్లా మారాడని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కాదని హిట్లర్ రాజ్యంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యంగా మార్చాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు, 24 గంటలు ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతులకు అండగా నిలిచామని గుర్తుచేశారు. ఆర్మూర్ ప్రాంతంలో ఎర్రజొన్నల డబ్బులు రైతులకు అందని సమయంలో రైతుల కోసం నిరాహార దీక్ష చేసి, ప్రభుత్వం ఏర్పడిన తరువాత రూ.13 కోట్లు చెల్లింపులు జరిగేలా చేసిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పుట్టిన నాడే రైతు డిక్లరేషన్ను బొంద పెట్టారని విమర్శించారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో అన్ని పంటలు కొనుగోలు చేస్తామని చెప్పి ఇప్పుడు కేంద్రం ఎంత కొనుగోలు చేయాలని చెబితే అంతే కొంటామని చెప్పడం మాట తప్పడమే అన్నారు. ఇది రైతులను మోసం చేయడమే అవుతుందన్నారు. కేంద్రం చెప్పినట్లు వినడానికే అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. షాపులో లేని యూరియా యాప్లో ఎలా వస్తుందని ప్రశ్నించారు. రైతులతో పెట్టుకున్న వారు, కేసీఆర్తో గొక్కున్న వారు ఎవరూ మిగలలేదని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. రేవంత్రెడ్డి అసమర్థ పాలనతో వేలాది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఉంటుందని, రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లకు ప్రొటోకాల్ ఇవ్వకుంటే రెండు వేల మందితో ఆర్మూర్ మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.