హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీలో స్వర్ణ పతకంతో మెరిసిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్ను.. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం అభినందించారు. ట్విట్టర్ వేదికగా కంగ్రాట్స్ నిఖత్ అంటూ ట్వీట్ చేశారు. 2019లో పసిడి పతక ప్రదర్శనను పునరావృతం చేస్తూ నిఖత్ మరోమారు స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. ఫైనల్లో ఉక్రెయిన్ బాక్సర్ను చిత్తుచేసింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని నిఖత్ ట్విట్టర్లో పంచుకుంది. ‘స్ట్రాంజా టోర్నీలో స్వర్ణం గెలువడం ద్వారా ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించడం సంతోషంగా ఉంది. నేను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇదే స్ఫూర్తి, మరింత కసితో పతకాలు సాధించి దేశానికి మరిన్ని కీర్తి, ప్రతిష్టలు తీసుకొస్తాను’ అని ట్వీట్ చేసింది.