సిటీబ్యూరో, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల పరిధిలో 13 రకాల కేటగిరిలలో కలిపి దాదాపు 35 వేల నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు 2019లో జారీ చేసిన నోటిఫికేషన్ గందరగోళంలో పడిందన్న అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో గత ఏడాదిలో పరీక్షలు నిర్వహించారు. దానికి సంబంధించిన ఫలితాలు ఈ నెల 14న రైల్వే వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తమకు ఉద్యోగాలు రాలేదన్న కారణంగా ఫలితాల ప్రకటన తర్వాత నిరుద్యోగులంతా ఆవేదనకు గురవుతున్నారు. అయితే దేశవ్యాప్తంగా సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ ద్వారా చేపట్టిన నియామక ప్రక్రియలో నిరుద్యోగులు ఎందుకని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదని, నియామక ప్రక్రియ మొత్తం నోటిఫికేషన్ నిబంధనల ప్రకారమే ముగించినట్లు రైల్వే బోర్డు అధికారికంగా ప్రకటించింది.
రైల్వే ఉద్యోగాలకు సంబంధించి 13 రకాల కేటగిరిలో 35 వేల నాన్ టెక్నికల్ పోస్టులకు డిగ్రీ, 10+2 అర్హతలు ఉన్న వారికి పోస్టులు అందుబాటులో తెచ్చారు. అయితే 35 వేల ఖాళీలలో 10+2 వారికి 10,500 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు గ్రాడ్యుయేట్లు కూడా అర్హులుగా పరిగణించారు. కటాఫ్ మార్కుల విషయానికొస్తే 10+2 వారి కంటే డిగ్రీ వారికే అధికంగా వచ్చాయి. దీంతో 10+2 అర్హతలున్న వారికి ఉద్యోగాలు రాకుండాపోయినట్లుగా మరో వర్గం అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నాన్టెక్నికల్ పోస్టులను అర్హతల వారిగా గతంలో వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చే వారు. పాత విధానం కాదని, సెంట్రైలైజ్డ్ నోటిఫికేషన్ పేరుతో.. తక్కువ సమయంలోనే పరీక్షలు నిర్వహించాలన్న ఆలోచనలో రైల్వే బోర్డు ఈ రెండు వర్గాలకు కలిపి ఒకే రకమైన పరీక్ష నిర్వహించడం వల్ల కూడా పలు అనుమానాలకు ఆస్కారం ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే దీనిపై రైల్వే బోర్డు మరింత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నిరుద్యోగులు కోరుతున్నారు.