హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): పరీక్షల నిర్వహణలో వరుసగా ఫెయిల్ అవుతున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).. సోమవారం జేఈఈ మెయిన్-2 పరీక్షలోనూ అదే తంతు కొనసాగించింది. నిజామాబాద్ జిల్లాలో పరీక్షకు గంట ముందు కేంద్రాన్ని మార్చడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలోని 28 మంది విద్యార్థులకు ఆర్మూర్ సమీపంలోని క్షత్రియ ఇంజినీరింగ్ కాలేజీలో కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు గంట ముందు కేంద్రాన్ని నిజామాబాద్ సమీపంలోని కిట్స్ కాలేజీకి మార్చినట్టు అధికారులు తెలపడంతో విద్యార్థులు టెన్షన్ పెట్టారు. అప్పటికప్పుడు బస్సులను ఏర్పాటుచేసి విద్యార్థులను కిట్స్ కాలేజీకి తరలించారు. సకాలంలో కేంద్రానికి విద్యార్థులు చేరుకోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జూన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్-1 పరీక్షల్లో రెండు పరీక్ష కేంద్రాల్లో సర్వర్డౌన్ సమస్యలు తలెత్తగా, వారికి మళ్లీ పరీక్షలను నిర్వహించారు.
పరీక్షలు షురూ..
జేఈఈ మెయిన్ -2 పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీఈ, బీటెక్ పేపర్లకు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ సహా పలు నగరాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ప్రశ్నప్రత్రాలను నిపుణులు విశ్లేషించారు. గణితం మధ్యస్థంగా ఉండగా, సుదీర్ఘమైన ప్రశ్నలు ఎప్పటిలాగే విద్యార్థులను గందరగోళానికి గురిచేశాయి. తరుచూ ప్రాక్టీస్ పేపర్లు, మాక్ టెస్ట్లకు హాజరైన వారికి గణితం ప్రశ్నలు అంత కష్టమేమికాదని నిపుణులు విశ్లేషించారు. ఇక ఫిజిక్స్ ప్రశ్నలు సులువు నుంచి మధ్యస్తంగా ఉన్నట్టుగా తెలిపారు.