School Sex Education | దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో లైంగిక విద్యను ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court)కు విన్నవించింది. 26 మంది సభ్యులతో కూడిన జాతీయ నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు రూపొందించిన ఈ కార్యక్రమం సుప్రీంకోర్టు ఆమోదం పొందిన తరువాత అమలవుతుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (POCSO) చట్టం పరిధిలోకి వచ్చే మైనర్లకు సంబంధించిన కేసుల పట్ల పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడంతో పాటు విద్యార్థుల వయసుకు తగిన అవగాహన, పిల్లల భద్రత, ఆరోగ్యకరమైన వికాసాన్ని పెంపొందించడం ఈ కార్యక్రమ లక్ష్యం.
జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవ్లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి ఈ వివరాలను వెల్లడించారు. 26 మంది సభ్యుల జాతీయ నిపుణుల కమిటీ సూచించిన సిఫారసులను కేంద్రం ఆమోదించినట్లు ఆమె తెలిపారు.
సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం పాఠశాలలు, కళాశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే వయసుకు తగిన పాఠ్యాంశాలతో ‘సమగ్ర లైంగిక విద్య’ ప్రారంభమవుతుంది. కనీసం వారానికి రెండుసార్లు 15 నుంచి 20 నిమిషాలు తప్పనిసరి తరగతులను నిర్వహించేందుకు ప్రతి పాఠశాల ఒక ప్రత్యేక నిపుణులైన ఉపాధ్యాయుడిని నియమించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది.
ప్రతిపాదిత పాఠ్యప్రణాళిక శరీర భద్రత, పరిశుభ్రత, శరీర భాగాలను అర్థం చేసుకోవడం, సురక్షితమైన, అసురక్షితమైన స్పర్శను గుర్తించడం వంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. విద్యార్థులు పెద్దవారయ్యే కొద్దీ పాఠాలు క్రమంగా కౌమార ఆరోగ్యం, సంబంధాలు, జీవిత నైపుణ్యాల అంశాలను బోధిస్తారు. దేశవ్యాప్తంగా ఏకరీతి పాఠ్యప్రణాళికను రూపొందించాలని కమిటీ సిఫారసు చేసింది.
దీనికోసం తల్లిదండ్రుల, సంరక్షకులు, ఉపాధ్యాయుల కోసం క్రమం తప్పకుండా సమావేశాలను నిర్వహించాలని కమిటీ తెలిపింది. పిల్లల వికాస దశలను, వారి భద్రత, శ్రేయస్సును కాపాడటంలో సమగ్ర లైంగిక విద్య ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ సమావేశాలు కుటుంబాలకు ఉపయోగపడతాయని కమిటీ వెల్లడించింది.
మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు కార్యదర్శి నేతృత్వంలోని ఈ కమిటీలో TISS, క్లినికల్ సైకాలజిస్టులు, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (NCPCR), న్యాయ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. పెరుగుతున్న మైనర్ గర్భాల కేసులు, పోక్సో చట్టం కింద పరస్పర అంగీకారంతో కూడిన కౌమార సంబంధాలను నేరంగా పరిగణించడాన్ని నివారించే మార్గాలను పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశం మేరకు కేంద్రం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.