హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రజల చైతన్యం ప్రభుత్వాలను సరైన మార్గంలో నడిపిస్తుంది. ప్రభుత్వ జవాబుదారీతనం ప్రజల్లో నమ్మకాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఈ రెండూ ఒకేసారి క్రియాశీలమైతే అద్భుతమే జరుగుతుంది. అలాంటి అద్భుతమే హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం చేసి చూపింది. నగర ప్రజల చైతన్యం.. ప్రభుత్వ జవాబుదారీతనంతో కోట్ల విలువైన భూములు కబ్జా కోరల నుంచి బయటపడి సమాజ సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయి. ఇంతటి విప్లవాత్మక కార్యానికి 2020 జూలై 5 న పునాది పడింది. ఆ పునాది వేసినది రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు.
కబ్జాలపై ప్రజాంకుశం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగ రం కబ్జారాయుళ్లకు స్వర్గధామంగా విలసిల్లింది. తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు నగరంలో యథేచ్ఛగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు. దేశంలో ఏ మహానగరానికీ లేని విధంగా హైదరాబాద్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉండటంతో.. నాటి పాలకులతో కలిసి రౌడీలు, రాజకీయ నేతలు ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా రాత్రికి రాత్రే బోర్డులు పాతేసేవారు. ఇదేమని అడిగితే దౌర్జన్యాలు, దాడులు, పోలీసులతో వేధింపులు ఉండేవి. అలా ఎకరాలకు ఎకరాలే కబ్జా కోరల్లో చిక్కుకొన్నాయి. కాలనీల్లోని పార్కులను కూడా కబ్జా చేసేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘ వ్యతిరేక చర్యలకు ముగింపు పలికి ప్రభుత్వ భూములు కాపాడాలని ప్రభుత్వం సంకల్పించింది. అది ప్రభుత్వం ఒక్కటే చేస్తే సరైన ఫలితాలు ఇవ్వదని గుర్తించిన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రజల భాగస్వామ్యంతోనే పరిస్థితిని చక్కదిద్దాలని సంకల్పించారు. ఈ బృహత్ కార్యంలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు 2020 జూలై 5న ‘అసెట్ ప్రొటెక్షన్ సెల్’ ప్రారంభించారు. ఇందులో జీహెచ్ఎంసీతోపాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
9.75 ఎకరాల భూమికి విముక్తి
అసెట్ ప్రొటెక్షన్ సెల్కు 1800-599-0099 టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశారు. నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కబ్జా అయితే.. వెంటనే స్థానికులు అసెట్ ప్రొటెక్షన్ సెల్కు ఫోన్చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు రంగంలోకి దిగి భూములను కబ్జాల నుంచి విడిపిస్తారు. అలా ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులతో 33 చోట్ల ఏకంగా 9.75 ఎకరాల భూమి (47,205 చదరపు గజాలు)ని కబ్జా కోరల నుంచి కాపాడారు. ఈ భూమి విలువ రూ. 411 .55 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలోనే 5060 చదరపు గజాల స్థలాన్ని రక్షించారు. ఈ భూమి విలువ కోట్ల రూపాయల విలువ చేస్తుంది. కబ్జాల నుంచి విడిపించిన భూమిని జీహెచ్ఎంసీకి అప్పగించి, అందులో పార్కులు, సామూహిక వినియోగ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
యాక్షన్లోకి ఇలా ..
అసెట్ ప్రొటెక్షన్ సెల్కు సమాచారం ఇచ్చిన వెంటనే సదరు ఫిర్యాదుదారు సమాచారం, కబ్జా తీరుపై సమగ్ర వివరాలను సేకరిస్తారు. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేకంగా ఒక విశిష్ట సంఖ్యను కేటాయిస్తారు. ఈ సంఖ్య ద్వారా భవిష్యత్తులో ఫిర్యాదు పురోగతిని పౌరులు తెలుసుకొనే వీలుంటుంది. ఫిర్యాదు అందిన వెంటనే అసిస్టెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారికి సమాచారం వెళ్తుంది. సదరు అధికారి కబ్జాల నుంచి కాపాడే కార్యక్రమాన్ని మొదలు పెడుతారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలోని జోన్లు, సర్కిళ్లలో ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతారు. జోన్లవారీగా ఒక్కో టీం (అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ బృందం) రంగంలోకి దిగుతాయి. కబ్జాదారుకు నోటీసులు అందిస్తున్నారు. వెంటనే ఆ భూమిలో ‘ప్రభుత్వ స్థలం’ అని బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. నిర్మాణాలు ఉంటే కూల్చివేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టు పరిధిలో ఉన్నవాటిని సమగ్ర వాదనలు వినిపించి కబ్జాల నుంచి కాపాడుతున్నారు. ఈ విషయంలో ఈవీడీఎం విభాగం అధికారులు సమర్థవంతంగా, చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే ఫలితం
ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరుల భాగస్వామ్యం ముఖ్యం. కబ్జాలపై పౌరులు 1800-599-0099 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలి. ఆ వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతాం. అసెట్ ప్రొటెక్షన్ సెల్ అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందుబాటులో ఉంటుంది.
– విశ్వజిత్ కంపాటి, ఈవీడీఎం డైరెక్టర్