న్యూఢిల్లీ, డిసెంబర్ 1: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు కంపెనీలు మళ్లీ పెంచాయి. ఒక్కో సిలిండర్పై రూ. 100.50ను వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపు బుధవారం (డిసెంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కి చేరగా, ముంబైలో రూ. 2,051కు చేరింది. 14 కిలోల సాధారణ వంటగ్యాస్ సిలిండర్పై ఎలాంటి పెంపు లేదు.
3 నెలలుగా ఆగని వాత
గడిచిన 3 నెలల్లో వాణిజ్య సిలిండర్ ధర రూ. 484 పెరిగింది. సెప్టెంబర్ 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,694గా ఉన్నది. దీనిపై అదేరోజు రూ.75 పెంచారు. అక్టోబర్ 1న రూ. 43, నవంబర్ 1న రూ.266 వడ్డించారు. తాజాగా రూ.100.50 పెంచడంతో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,101కు చేరుకున్నది.