న్యూఢిల్లీ, నవంబర్ 1: దీపావళికి రెండు రోజుల ముందు చమురు కంపెనీలు బాంబు పేల్చాయి. వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్పై ఏకంగా రూ.266 పెంచాయి. కమర్షియల్ సిలిండర్పై ఇంత భారీ స్థాయిలో ధర పెంచడం ఏడేండ్లలో తొలిసారి. గతంలో 2014 జనవరి 1న సిలిండర్పై చమురు కంపెనీలు రూ.353 పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.2,175కు పెరిగింది. ఢిల్లీలో రేటు రూ.2వేలు దాటింది. పెరిగిన ధరలు నవంబర్ 1(సోమవారం) నుంచే అమల్లోకి వచ్చాయి. గృహావసరాల కోసం వినియోగించే సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. వాస్తవానికి ఎల్పీజీ ధరలు పెరుగుతాయని ముందే ఊహించారు. అయితే ఈ స్థాయిలో పెంపుదల ఉంటుందని ఎవరూ అంచనా వేయలేదు. పెరుగుతున్న గ్యాస్ రేట్లతో ఇప్పటికే హోటళ్లలో, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. ఫలితంగా కస్టమర్ల సంఖ్య తగ్గుతుండటంతో చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.
ఆరో రోజూ పెట్రో బాదుడు
పెట్రో రేట్లు వరుసగా ఆరో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, లీటర్ డీజిల్పై 35 పైసల చొప్పున చమురు కంపెనీలు పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.114.49కు, డీజిల్ రేటు రూ.107.78కి పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన సరఫరా, డిమాండ్ గురించి చమురు ఎగుమతి దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), రష్యా లాంటి దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.