హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సంస్థల్లోని ఉద్యోగుల వేతన సవరణకు త్వరలోనే పీఆర్సీ కమిటీని వేస్తామని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు తమకు హామీ ఇచ్చినట్టు విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నేతలు తెలిపారు. ఇందుకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించినట్టు జేఏసీ నేతలు ఎన్ శివాజీ, పీ అంజయ్య, కోడూరి ప్రకాశ్ తెలిపారు. శుక్రవారం విద్యుత్తు ఉద్యోగ, కార్మిక సంఘాలతో దేవులపల్లి ప్రభాకర్రావు ఎర్రగడ్డ జీటీఎస్ కాలనీలోని విద్యుచ్చక్తిభవన్లో సమావేశమయ్యారు.
విద్యుత్తు సంస్థ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఉద్యోగుల కర్తవ్యంపై దిశానిర్దేశం చేశారు. విద్యుత్తు పంపిణీ, సరఫరా నష్టాలను 1 శాతం తగ్గిస్తే సంవత్సరానికి 580 కోట్లు ఆదా అవుతుందని, ఈ దిశగా పనిచేయాలని కోరినట్టు నేతలు తెలిపారు. వ్యయాన్ని తగ్గించాలని, వృథాను నియంత్రించాలని, చౌర్యాన్ని అరికట్టాలని, పీఎల్ఎఫ్ను పెంచాలని, బొగ్గును సమర్థంగా వినియోగించుకోవాలని సీఎండీ సూచించినట్టు నేతలు వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎండీలు రఘుమారెడ్డి, గోపాల్రావు, జేఏసీ నేతలు రామేశ్వరశెట్టి, అశోక్, వెంకటేశ్వర్లు, రమేశ్, వినోద్, రాములు, ముక్తదార్, మాతంగి శ్రీనివాస్, ప్రణీత, స్వామి, తుల్జారాంసింగ్ తదితరులు పాల్గొన్నారు.