హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో నిర్మించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సూపర్ హీరో అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అభివర్ణించారు. పాలకులు మంచివాళ్లు అయితే ప్రకృతి సహకరిస్తుందనడానికి సీఎం కేసీఆర్ పాలనే నిదర్శనమని చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కార్యక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను కారులో తిరిగేలా చేస్తే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులను కార్ల కింద వేసి తొక్కిస్తున్నదని పేర్కొన్నారు. రైతులపై కాల్పులు జరిపిన టీడీపీ, కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయాయని, మోదీ ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని చెప్పారు. కేసీఆర్ పథకాలను జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయి. మరే రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల ప్రయోజనాలే ముఖ్యం. కర్ఫ్యూ అనే పదాన్ని, ఆ వాతావరణాన్నే లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. గతంలో మాదిరిగా హైదరాబాద్లో దొంగల భయం లేదు. పేకాట క్లబ్బులు, మట్కా వంటి జాడ్యాలు రాష్ట్రం నుంచి పోయాయి.
– ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
భూ రికార్డులను ప్రక్షాళన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ను తేవడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగింది. నిజాం కాలం నాటి భూ రికార్డులతో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్ సాహసంతో ఈ పనిని పూర్తిచేశారు. ఇందులోని చిన్న అంశాలను పట్టుకొని విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి.
– ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్