వనపర్తి : వ్యవస్థలో ఉన్న లోపాలను పరిష్కరిస్తూ వస్తున్నాం. విద్యా వ్యవస్థలోని ఇబ్బందులపైనా దృష్టి సారించాం. అందరికి న్యాయం జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు తమ మద్దతును ప్రకటించింది. ఈ క్రమంలో గురువారం వనపర్తిలో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా కాంట్రాక్టు లెక్చరర్ల సమావేశానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొదటగా వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, తాగునీటి వ్యవస్థను సరిదిద్దాం. ఇప్పుడు తమ ముందున్నది విద్యావ్యవస్థనే అన్నారు. విద్యారంగం అంతా ప్రభుత్వ విద్యాలయాలలో జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. కాంట్రాక్టు లెక్చరర్లకు న్యాయంచేసింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
222 జీఓ ద్వారా కష్టాలు లేకుండా చేశామన్నారు. 12 నెలల జీతం ఇచ్చి అండగా నిలిచినట్లు గుర్తుచేశారు. 2001 నుండి 2014 వరకు కాంట్రాక్టు లెక్చరర్లకు ఏడాదికి 5 నుండి 8 నెలల జీతమే వచ్చేది. మానవతా దృక్పథంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 12 నెలల జీతం అందిస్తున్నారన్నారు. బదిలీలు, ఇతర సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ కాకుండా అడ్డుకున్నది విపక్షాలేనన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలన్నీ సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కురుమూర్తి, పాలిటెక్నిక్ లెక్చరర్ల ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దశరథ్ నాయక్, డిగ్రీ కళాశాలల లెక్చరర్ల సంఘం ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.