హైదరాబాద్, జూలై 21: ఐటీ సేవల సంస్థ సైయెంట్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.116.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది వచ్చిన లాభంతో పోలిస్తే కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది. అటు ఆదాయంలో ఏడాది ప్రాతిపదికన 18 శాతం అధికమై రూ.1,250 కోట్లు ఆర్జించినట్లు ప్రకటించింది. గడిచిన త్రైమాసికంలో 424.2 మిలియన్ డాలర్ల విలువైన ఆరు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సైయెంట్ సీఈవో, ఎండీ కృష్ణ బొడనపు ఈ సందర్భంగా తెలిపారు. గత త్రైమాసికంలో బలమైన వృద్ధిని సాధించినట్లు, కమ్యూనికేషన్స్, మైనింగ్, హెల్త్కేర్ టెక్నాలజీ, ఆటోమోటివ్ రంగాలు ఆశాజనక పనితీరు కనబర్చడంతో ఆదాయంలో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు.