న్యూఢిల్లీ: సీజేఐ ఎన్వీ రమణ సారీ చెప్పారు. ఇవాళ రిటైర్ అయిన ఆయన.. సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్ అంశంలో జరుగుతున్న జాప్యం పట్ల క్షమాపణలు తెలిపారు. దేశంలో పెండింగ్ కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క ఆదేశంతో లేదా ఒక తీర్పుతో నిర్ణయించలేమన్నారు. కేసుల లిస్టింగ్, పోస్టింగ్ అంశంలో జాప్యం జరుగుతోందని, ఆ అంశంపై దృష్టి పెట్టలేకపోయినట్లు ఎన్వీ రమణ అన్నారు. సారీ చెప్పిన ఆయన ప్రతి రోజు బిజీగా ఫైట్ చేసినట్లు వెల్లడించారు. కోర్టులోని ఆఫీసర్లే ఈ వ్యవస్థ విశ్వసనీయతను కాపాడాలన్నారు. విశ్వసనీయతను రక్షించలేని క్షణం సమాజంలో ప్రజల నుంచి గౌరవాన్ని పొందలేమన్నారు. భారతీయ న్యాయవ్యవస్థ కాలక్రమేన వృద్ధి చెందిందని, దీన్ని ఒక్క తీర్పుతో అభివర్ణించలేమన్నారు. ఈ వ్యవస్థలోని న్యాయమూర్తిని రక్షించే బాధ్యత బెంచ్, బార్ మీదే ఆధారపడి ఉంటుందని ఎన్వీ రమణ తెలిపారు. కోర్టు సమస్యల్ని పరిష్కరించేందుకు ఆధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరమని ఆయన అన్నారు. బార్ సహకరిస్తేనే కోర్టులో మార్పులు సాధ్యమన్నారు. జూనియర్లను సరైన పథంలో నడిపించాలని ఆయన బార్ సీనియర్ సభ్యుల్ని కోరారు.