హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): న్యాయమూర్తులు ప్రజలకు అర్థమయ్యే స్థానిక భాషల్లో తీర్పులివ్వటానికి ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ర్టాల్లోని జడ్జీలు తెలుగులో తీర్పులివ్వాలని, లేదంటే తీర్పులను తెలుగులోకి అనువదించి వెబ్సైట్లలో పెట్టాలని సూచించారు. తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం) లో 34వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ముగింపు సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ రమణ మాట్లాడు తూ.. తాను జ్యుడీషియల్ అకాడమీ ఇంచార్జిగా ఉన్నప్పుడు తెలుగులో తీర్పులు ఇవ్వాలని ఎంతో ప్రోత్సహించానని తెలిపారు.
‘ఏడాదిపాటు కొందరు తెలుగులో జడ్జిమెంట్లు రాశారు. వారికి సన్మానం కూడా చేశాం. కానీ, రానురాను అది అంతరించింది. ఈ మధ్య పెద్దపెద్ద తీర్పులిస్తున్నారు. ఇంగ్లిష్లో ఉండే అవి చాలా సంక్లిష్టంగా ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే లాయర్ దగ్గరికెళ్లి మరోసారి ఫీజు చెల్లించాలి. అందుకే సుప్రీం కోర్టు తీర్పులను అన్ని ప్రముఖ భాషల్లోకి అనువదించి వెబ్సైట్లో పెడుతున్నాం. ఆ తీర్పులను తర్జుమా చేయాలని రాష్ట్రపతి కూడా సూచించారు’ అని జస్టిస్ రమణ వెల్లడించారు.
పుస్తకమే హస్త భూషణం
గతంలో పుస్తకం హస్త భూషణంగా ఉండేదని, ఇప్పుడు సెల్ఫోన్ హస్తభూషణంగా మారిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరిగి పుస్తకమే హస్తభూషణం కావాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ను చూస్తే పుస్తకం ఎప్పటికీ సజీవంగా ఉంటుందని నమ్మకం కలిగిందని అన్నారు. యువతరం పుస్తకాలంటే ఆసక్తి చూపడం ఎంతో ఆశాజనకంగా ఉన్నదని పేర్కొన్నారు. విజ్ఞానం లోపించిన చోటే అజ్ఞానం చొరబడుతుందని జస్టిస్ రమణ అన్నారు. నేటి సోషల్ మీడియా ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఒక మంచి పుస్తకం, ఒక మంచి రచన గురించి సోషనల్ మీడియాలో ఎప్పుడోగానీ సమాచారం దొరకదని అన్నారు. ఇప్పటికీ కొన్ని వార్తా పత్రికలు ప్రతివారం ఒక్కరోజైనా పుస్తక విమర్శలు, రచనల గురించి పాఠకులకు తెలిపేందుకు స్థలం కేటాయిస్తున్నాయని అభినందించారు. ‘పుస్తకం మహిమ అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీశ్రీ తన విప్లవ గేయాలను 1930వ దశకం నుంచే రాయడం మొదలు పెట్టారు. 1950లో ఆయన మిత్రుడు నళినీకుమార్ ఆ గేయాలను ‘మహాప్రస్థానం’ రూపంలో ప్రచురించే వరకు శ్రీశ్రీ గొప్పతనం ఎవరికీ తెలియలేదు. అందుకే ప్రతి మంచి రచన, మంచి ఆలోచన పుస్తకరూపంలో రావాలి’ అని ఆకాంక్షించారు.
పదవీ విరమణ తర్వాత పుస్తకాలే నా నేస్తాలు
డిజిటల్ టెక్నాలజీ వల్ల ప్రచురణకర్తలు నష్టపోతున్నారని, దీనికితోడు పైరసీ పెను ముప్పుగా దాపురించిందని జస్టిస్ రమణ తెలిపారు. ఇది ఒకరకంగా మేధో హక్కుల ఉల్లంఘనే అన్నారు. ఈ రకమైన చౌర్యాన్ని అరికట్టడానికి చట్టాలు పటిష్ఠంచేసి న్యాయవాదులు, న్యాయమూర్తులకు తగు శిక్షణ ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తనకు ప్రస్తుతం బాధ్యతలు పెరిగి పుస్తకాలు చదవడం తగ్గిందని చెప్పారు. పదవీ విరమణ తరువాత పుస్తకాలే తన నేస్తాలు అని పేర్కొన్నారు.
పుస్తకం మహోత్సవం నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి, ఫెయిర్ను విజయవంతం చేసిన అందరికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణకు ‘తెలుగెత్తి జైకొట్టు’ అనే పుస్తకాన్ని రాష్ట్రమంత్రి శ్రీనివాస్గౌడ్ బహూకరించారు. అంతకుముందు నేరెళ్ళ వేణుమాధవ్ ప్రాంగణం నుంచి హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ అధ్యక్షుడు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, బుక్ ఫెయిర్ కార్యదర్శి రాజేశ్వర్రావు ఒగ్గు కళాకారుల నృత్యాలు, తాళాలు తప్పెట్లతో జస్టిస్ ఎన్వీ రమణకు ఘన స్వాగతం పలికారు.