హైదరాబాద్, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): అనుకూల తీర్పులు ఇవ్వకుంటే న్యాయమూర్తులపై ఎన్నెన్నో నిందలు వేస్తున్నారని, భౌతిక దాడులకు దిగుతున్నారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఈ ఘటనలపై కోర్టులు స్పందించే వరకు ఏ అధికారులు పట్టించుకోవటం లేదని, దర్యాప్తు చేయటం లేదని చెప్పారు. ఆదివారం విజయవాడ కానూరు సిద్ధార్థ కాలేజీలో దివంగత జస్టిస్ లావు వెంకటేశ్వర్లు స్మారక ఉపన్యాస సభలో సీజేఐ మాట్లాడారు. ప్రభుత్వాలు సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడే జడ్జీలు నిర్భయంగా పనిచేయగలుగుతారని తెలిపారు.
రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు. జడ్జీలను జడ్జీలే నియమిస్తున్నారని అనటం పెద్ద భ్రమ అని వ్యాఖ్యానించారు. ‘ఇటీవల కాలంలో జడ్జీలను జడ్జీలే నియమిస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇది వట్టి భ్రమే. జడ్జీల నియామకాల్లో కేంద్ర న్యాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, గవర్నర్లు, హైకోర్టు కొలీజియం, ఇంటెలిజెన్స్ బ్యూరో, అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర ఉంటుంది. ఇది తెలిసీ కూడా న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమిస్తున్నారని కొందరు అంటున్నారు.
ఇది సరికాదు’ అని సీజేఐ పేర్కొన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లంతా ఎన్నో దశాబ్దాలుగా ప్రభుత్వాల చేతుల్లో కీలు బొమ్మల్లాగే ఉంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రాసిక్యూటర్లను నియమించడానికి ప్రత్యేక కమిటీ వేయాలని అన్నారు. న్యాయ వ్యవస్థలో అనేక మార్పులు రావాల్సి ఉన్నదని, ఒక వ్యక్తిపై ఆరోపణలు అవాస్తమని తేలితే వారికి నష్టపరిహారం ఇచ్చే వ్యవస్థ లేదని, నిరాధారమైన ఆరోపణలతో సదరు వ్యక్తికి నష్టం కలుగుతున్నదని చెప్పారు. తన తీర్పుల్లో దీనిపై పలు మార్లు ప్రస్తావించానని గుర్తు చేశారు. ప్రస్తుతం హ్యాకింగ్ అతి పెద్ద సమస్యగా మారిందని, సాంకేతిక పరిజ్ఞానం జడ్జీలకు చాలా ముఖ్యమని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు.
ఆమె అమ్మలేని లోటు తీర్చారు
జస్టిస్ లావు నాగేశ్వర్రావు తల్లి తనకు అమ్మలేని లోటును తీర్చారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయమూర్తిగా బాగా పనిచేస్తున్నానని ఆమె ప్రశంసించటం మరిచిపోలేనని చెప్పారు. ఉపన్యాసం మధ్యలో జస్టిస్ లావు నాగేశ్వర్రావు తల్లికి సీజేఐ పాదాభివందనం చేశారు. లావు వెంకటేశ్వర్లు కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని సీజేఐ గుర్తు చేసుకొన్నారు.
సీజేఐకి గవర్నర్ తేనీటి విందు
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదివారం రాజ్భవన్లో తేనీటి విందు ఇచ్చారు. కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు, పలువురు జడ్జిలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.